
అమరావతి, : వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాల పాటు పశుసంవర్ధక శాఖకు తాళాలు వేసి పశువైద్యుల నియామక భర్తీకి సంబంధించి ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని, పాడి రైతులు, పశువుల సంరక్షణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. శుక్రవారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ 2014-2019 సమయంలో సీఎం చంద్రబాబు చొరవతో పశువైద్యుల నియామక భర్తీకై నోటిఫికేషన్ ఇచ్చి 2017 సంవత్సరంలో 303, 2018లో మరొక నోటిఫికేషన్ ఇచ్చి 223 వెటర్నరీ డాక్టర్స్ పోస్టులు బర్తీ చేశామని తెలిపారు. 2024 ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఖాలీ ఉన్నాయి, ఎలా రిక్రూట్ చేయాలనేది ఆర్దిక శాఖకు నివేదిక అందచేశామని, ఆదేశాలు రాగానే ఖాలీగా ఉన్నటువంటి పశువైద్య డాక్టర్ల పోస్టులకు నోటీఫేకషన్ ఇచ్చి భర్తీ చేస్తామన్నారు. అప్పటివరకు రాష్ట్రంలో పశువైద్యానికి ఇబ్బందులు ఎదుర్కొకూడదని ప్రత్యాహ్నాయంగా గ్రామస్థాయిలో దాదాపుగా 6137 మంది వెటర్నరీ అసిస్టెంట్స్ చే వైద్యసేవలు అందచేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పశువైద్యుడు లేడనే మాట రాకుండా, పశు వైద్యానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లను చేశామని, ప్రస్తుతానికైతే ఏ సమస్య లేకుండా చర్యలు చేపట్టామని తెలియజేశారు. పశుసంవర్ధక సహయకులు గ్రామస్థాయిలో రైతు సేవా కేంద్రాల్లో చురుగ్గా పనిచేస్తున్నారని, అందుబాటులో ఉన్న పశువైద్యుల సాంకేతిక మద్దతుతో సేవలు అందిస్తున్నారని అన్నారు.
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ల ఖాళీలు భర్తీకి ప్రణాళిక
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ల 293 ఖాళీలు భర్తీ చేసేందుకు 258 పోస్టులను నిర్ధారించి ఆర్ధిక శాఖకు ప్రతిపాదించడం జరిగిందని మంత్రి అచ్చెన్న తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని 24.84 కోట్లతో ప్రతిపాదనలు సత్వరమే చేపట్టాలని ఆర్ధిక శాఖకు తెలియజేశామని, ఆదేశాలు రాగానే రిక్రూట్మెంట్ చేస్తామని అన్నారు. అదేవిధంగా తిరుపతిలోని వెంకటేశ్వర పశువైద్యశాలలో అండర్ గ్రాడ్యుయేషన్ , పీజీ, పిహెచ్డి విద్యార్థులకు అందచేసే స్టైఫండ్ చివరిసారిగా 2013 వ సంవత్సరంలో పెంచడం జరిగిందని, పది సంవత్సరాల తర్వాత కూటమి ప్రభుత్వంలోనే ఇటీవలే ఈ మూడు విద్యార్థులకు స్టైఫండ్ కూడా పెంచడం జరిగిందన్నారు. ప్రస్తుతం యూజీ విద్యార్ధులకు 7000 నుంచి 10,500 , పీజీ వాళ్లకు 9000 నుండి 13,500 , పీహెచ్డీ వాళ్లకి 10,000 నుండి 15,000 రూపాయలకు పెంచి వారి చదువుకి ఇబ్బంది లేకుండా చేశామని తెలిపారు.
రాష్ట్రంలో కొన్ని పశువైద్యశాలలు మరమ్మత్తులకు గురయ్యాయని, కొన్ని చోట్ల ప్రైవేట్ బిల్డింగులలో హాస్పిటల్స్ నిర్వహిస్తున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందని మంత్రి అచ్చెన్న తెలిపారు. ఆధునీకరణ చేయాల్సిన పశు హస్పిటల్స్ ఎన్నో గుర్తించి, 434 పశు హాస్పిటల్స్ కి భవనాలు అవసరమని ఇందుకు ఆర్ ఐ డీఎఫ్ కింద, నాబార్డ్ కి ప్రతిపాదనలు పంపించామని, త్వరితగతిన అనుమతులు పొంది పనులు పూర్తిచేస్తామని తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండలంలో పశువులు వింత వ్యాధితో చనిపోతున్నాయన్న సమాచారం తెలిసిన వెంటనే అప్రమత్తమై అధికార యంత్రాంగంతో మాట్లాడామని, 7 పశువులు చనిపోయాయని, సాంపిల్స్ కలెక్ట్ చేసామని తెలిపారు. వ్యాధి ఎలా సోకుతుందో అందుకు కారణాలు అన్వేషించి నివారణ చర్యలు చేపడతామని మంత్రి అచ్చెన్న హమీ ఇచ్చారు. 2014-2019 సమమంలో 3 నెలలకొకసారి పశువులకు ఇచ్చే వ్యాక్సిన్ ను, ప్రతి నెల గ్రామాలలో నిర్వహించే పశు వైద్య శిబిరాలు, దాణా అందచేత వైసీపీ హయాంలో నిలిపివేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మళ్లీ ఈ సదుపాయాలను పాడి రైతులకు అందచేస్తూ పాడిపరిశ్రమ అభివృద్ధిని గాడిన పెడుతున్నామని మంత్రి అచ్చెన్న తెలిపారు. ప్రతి కుటుంబం పశుపోషణను ప్రోత్సహించాలని దాని వలన ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుందని అన్నారు.
