Betting Case | విచారణకు హాజరైన యాంకర్ శ్యామల

  • Post category:Blog
  • Post last modified:March 24, 2025

హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల సోమవారం రోజున పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్స్‌కు సంబంధించిన ఆరోపణలపై పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌లపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో ఇప్పటికే విష్ణు ప్రియ, రీతూ చౌదరి పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే శ్యామల తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. శ్యామల దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు… ఆమెపై దాఖలు చేసిన కేసును క్వాష్ చేసేందుకు నిరాకరించింది.అదే సమయంలో ఆమెను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అలాగే సోమవారం (మార్చి 24) రోజున పంజాగుట్ట పోలీసుల ముందు హాజరు కావాలని శ్యామలను ఆదేశించింది.

ఈ కేసు దర్యాప్తులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలోనే శ్యామ సోమవారం రోజున పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు చేరుకుని… పోలీసు విచారణకు హాజరయ్యారు