Japan Tour | టోక్యో వాటర్‌ ఫ్రంట్ సందర్శించిన సీఎం రేవంత్ !

సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు జపాన్ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. అందులోభాగంగా శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్‌లోని టోక్యో వాటర్‌ ఫ్రంట్‌ (Tokyo Waterfront) ను సందర్శించింది.

టోక్యో మహానగరం మధ్య నుంచి పారే సుమిదా నది రివర్ ఫ్రంట్‌గా అభివృద్ధి చేసిన తర్వాత పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

టోక్యో నగరం మధ్యన జల రవాణాకు అనుగుణంగా రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయడం, సుమిదా నది పక్క నుంచి పొడవాటి ఫ్లైఓవర్‌, అవసరమైన చోట ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు టోక్యో నగర రూపురేఖలను ఎలా మార్చిందీ ఈ ప్రతినిధి బృందం పరిశీలించింది.

మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం టోక్యో రివర్ ఫ్రంట్‌ను క్షణ్ణంగా పరిశీలించింది.

భారీ పెట్టుబడులు..

కాగా, ఈరోజు రెండు సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొన్నాయి. రుద్రారంలో కొత్త ఫ్యాక్టరీని స్థాపించడానికి తోషిబా కంపెనీ రూ. 562 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది.

400 మెగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఎన్‌టీటీ డేటా- నెయిసా సంస్థ తెలంగాణలో రూ.10,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది.