స్వచ్ఛాంధ్ర ఓ ఉద్యమం

(ఆంధ్రప్రభ, అమరావతి ) : ఉద్యమ స్పూర్తితో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని కొనసాగించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) కోరారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం (State Secretariat)లో రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరిగింది. స్వచ్ఛాంధ్ర, సర్కులర్ ఎకానమీ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”జనవరి నుంచి వేస్ట్ అనేది ఎక్కడా కనిపించకూడదు. 83 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ క్లియర్ చేసాం. చెత్తపై పన్ను కూడా రద్దు చేశాం. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల కోసం కార్పొరేషన్ ద్వారా నిధులిస్తున్నాం.

స్వచ్ఛ భారత్ (Swachh Bharat) కోసం ఏ జిల్లాలో అయినా పైలట్ ప్రాజెక్టుగా కార్యక్రమాలు చేపడితే అది రాష్ట్రమంతా వర్తింప చేయండి. ఉమ్మడి రాష్ట్రంలోనే సింగపూర్ (Singapore) విధానాలను పరిశీలించి ఉమ్మడి రాష్ట్రంలో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాం. ఆ తర్వాత క్లీన్ అండ్ గ్రీన్ పచ్చదనం పరిశుభ్రం పేరిట కార్యక్రమాలు నిర్వహించాం. స్వచ్ఛత అంటే పరిశుభ్రత పాటించేలా చూడడమే కాదు… ప్రజల ఆలోచనా విధానం కూడా మారేలా చూడాలి. ఇంట్లో చెత్తను రోడ్డు బయట వేయటం కొందరికి అలవాటు. డ్రెయిన్స్ లో చెత్తవేయటం వల్ల అవి అడ్డుపడి నీటి ప్రవాహానికి ఇబ్బంది. ఇలాంటి అలవాట్లకు ప్రజలు దూరం జరిగేలా చూడాలి.

ఎలాంటి కార్యక్రమమైనా ప్రజల భాగస్వామ్యం ఉంటే సక్సెస్ అవుతుంది. అందర్నీ గేదర్ చేసి కార్యక్రమాలు నిర్వహిస్తే ఆయా కార్యక్రమాలు సక్సెస్ కావడంతో పాటు… ఒత్తిడి కూడా తగ్గుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే గతంలో హ్యాపీ సండే వంటి కార్యక్రమాలు చేపట్టాం. ప్రజలు ఆ కార్యక్రమాల్లో పాల్గొని తమ టాలెంట్ ను ప్రదర్శించేవారు. ఇక ఒత్తిడి తగ్గించుకునేందుకు లాఫింగ్ సొసైటీల నుంచి షౌటింగ్ సొసైటీలు ఏర్పాటు చేసేంత వరకు వెళ్లారు. జాతరలు వంటివి చేపట్టేది ప్రజల గ్యాదరింగ్ కోసమే. ఆ తరహాలోనే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టాలి. స్వచ్ఛతాహీ సేవ సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2 తేదీ వరకూ చేపట్టాలి.” అని సీఎం చెప్పారు.