హైదరాబాద్, ఆంధ్రప్రభ : బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన హోటల్ యాజమాన్యం వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మొదటి అంతస్తులో విద్యుత్ వైర్లు కాలడంతోనే ప్రమాదం జరిగినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం హోటల్లో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు చెప్పారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం ఆ హోటల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బస చేస్తున్నట్లు తెలుస్తోంది. మంటల ధాటికి పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలముకున్నాయి. దీంతో హోటల్లో అలజడి చెలరేగింది. టూరిస్టులు, సిబ్బంది భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.
Breaking | పార్క్ హయత్ లో అగ్నిప్రమాదం
- Post category:జాతీయం
- Post last modified:April 14, 2025
