
కర్నూలు: ఉల్లి రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉల్లి పండించిన ప్రతి రైతుకు హెక్టారుకు రూ.50,000 చొప్పున నగదు సాయం అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి టి.జి. భరత్ సీఎం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలులో శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉల్లి రైతుల కష్టాలపై సీఎం చంద్రబాబు మొదటి నుంచే సమీక్షిస్తూ తగిన నిర్ణయాలు తీసుకున్నారని గుర్తుచేశారు. అధిక వర్షాలు, ధరల పతనం కారణంగా నష్టపోతున్న రైతులకు ఇది ఊరటనిచ్చే విషయం అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులున్నా రైతులకు అండగా నిలవాలన్నదే సీఎం ఉద్దేశమని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఏ రైతుకు నష్టం జరగదని భరోసా ఇచ్చారు.. గిట్టుబాటు ధర లేక…ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులకు కన్నీళ్లు ఆగడం లేదు. కూలి, రవాణా ఖర్చులు పెనుభారంగా మారాయి. ఉల్లి పంట కోసి మార్కెట్కు తరలిద్దామంటే గిట్టుబాటు కావడం లేదని కొందరు రైతులు పొలంలోనే వదిలేస్తున్నారు. మరికొందరు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటాకు రూ.1,200 అయినా చేతికి వస్తుందన్న ఆశతో పంటను యార్డు వరకు తీసుకెళ్తున్నారు. అయినా అక్కడ నిల్వ చేసేందుకు చోటు లేదు. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లిపోయారు. వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఈ తరుణంలో ఉల్లి పండించిన ప్రతి రైతుకు హెక్టారుకు రూ.50 వేలు చొప్పున నగదు సాయం అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఉల్లి రైతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది.
