
తొమ్మిది రంగాల కోసం కొత్త నగరం
పెట్టుబడులకు భారీ అవకాశాలు
తెలంగాణాలో మీ ఇన్వేస్ట్మెంట్లకు భారీ భద్రత
పారిశ్రామికవేత్తలకు రేవంత్ రెడ్డి పిలుపు
కెసిఆర్ ను ట్రంప్ తో పోల్చిన ముఖ్యమంత్రి
న్యూ ఢిల్లీ, ఆంధ్రప్రభ
హైదరాబాద్ సమీపంలో కొత్త నగరాన్ని నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.తొమ్మిది వర్టికల్ రంగాలకు ప్రత్యేకంగా న్యూసిటీ నిర్మాణం ఉంటుందని, కొత్త నగరం పేరు ‘భారత్ ఫ్యూచర్’ సిటీ అని చెప్పారు. భవిష్యత్ తరాలకు అవకాశాలను క్రియేట్ చేయడం తమ ప్రభుత్వం లక్ష్యం అని చెప్పారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా హైదరాబాద్కు ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తన డ్రీమ్ అని, మహాత్మా గాంధీ యంగ్ ఇండియా పేరుతో ఇచ్చిన స్ఫూర్తిని తాను ఫాలో అవుతానని సీఎం చెప్పారు.
పెట్టుబడులే లక్ష్యంగా శుక్రవారం నాడు నిర్వహిస్తున్న ఢిల్లీలో పబ్లిక్ ఎఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా 12వ వార్షిక సదస్సులో ‘విజన్ తెలంగాణ రైజింగ్ 2047’ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ‘కొత్త నగరాన్ని నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశాం. 9 తెలంగాణలో ఆర్గానికి పంటలు పండుతున్నాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, మీ పెట్టుబడులకు భద్రత ఉంటుంది. రాష్ట్రంలో డ్రగ్స్ కంట్రోల్ చేశాం. ప్రపంచంలోనే డ్రగ్స్ నిర్మూలనలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి.. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్స్గా మారండి. ఎడ్యుకేషన్పై దృష్టి పెట్టండి. నాలెడ్జ్ హబ్పై ఫోకస్ పెట్టండి. ఎవరు పెట్టుబడులు పెట్టడానికి వచ్చినా వాళ్లకు పూర్తిగా మా సపోర్ట్ ఉంటుంది’ అని చెప్పారు.
స్కిల్ యూనివర్సిటీ నా డ్రీమ్..
‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నా డ్రీమ్. మహాత్మా గాంధీ యంగ్ ఇండియా పేరుతో ఇచ్చిన స్ఫూర్తిని నేను ఫాలో అవుతాను. ఈ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు కచ్చితంగా వస్తాయి అని రేవంత్ వివరించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఎంతో ఆలోచనతో ప్లాన్ చేశామని చెప్పారు. పొలిటికల్గా ఫెయిల్యూర్ వల్ల ఒలింపిక్స్లో మెడల్స్ కొట్టలేకపోతున్నామని ఆయన అభిప్రాయపడ్డారు..
కేంద్ర సహకారం కోరుతున్నాం..
మచిలీపట్నం పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే విత్ రైల్వే లైన్ కావాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు.. 2025 డిసెంబర్ 9న తెలంగాణ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తామన్నారు. 40 శాతం బల్క్ డ్రగ్స్ తెలంగాణ ఉత్పత్తి చేస్తోందని అంటూ వాక్సిన్లు కూడా తెలంగాణ నుంచే ఉత్పత్తి అవుతున్నాయన్నారు.. ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికాకే నష్టమని, అమెరికా అనుమతి ఇవ్వకపోతే తెలంగాణకు రండి’ అని సీఎం సదస్సుకు హాజరైన పారిశ్రామికవేత్తలను కోరారు.
తెలంగాణలోనూ కెసిఆర్ రూపంలో ఓ ట్రంప్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పరిపాలన చేయాలంటే పొలిటికల్ విల్ చాలా అవసరమన్నారు. తెలంగాణలో సైతం ఒక ట్రంప్ ఉండే వారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఆ తెలంగాణ ట్రంప్ను ప్రజలు పక్కన పడేశారంటూ ఎద్దేవా చేశారు. ఇష్టారాజ్యంగా పరిపాలన చేసే వారు ఎవరైనా ట్రంప్ అవుతారంటూ సీఎం వ్యాఖ్యానించారు. ట్రంప్ లాంటి వ్యక్తుల ఆటలు చాలా రోజులు కొనసాగవని జోస్యం చెప్పారు. రాత్రి కలలో అనుకున్నది ట్రంప్ పగలు అమలు చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. డొనాల్డ్ ట్రంప్ ఒక రోజు ప్రధాని మోదీని.. తన మిత్రుడని పేర్కొంటారన్నారు. ఆ వెంటనే భారత్పై 50 శాతం టారిఫ్లు విధిస్తారంటూ ట్రంప్ వ్యవహార శైలిని ఈ సందర్భంగా సీఎం రేవంత్ ఎండగట్టారు. భారతీయులకు వీసాలు ఇవ్వకపోతే అమెరికాకే నష్టమని పేర్కొన్నారు.
