
ఏలూరు : చాలా మంది వృద్ధులు ఒంటరిగా నివసిస్తుంటారు. ఉపాధి నిమిత్తం కుటుంబ సభ్యులు ఇరత ప్రాంతాలకు వెళ్లడమే.. వేరే ఊర్లు, పట్టణాల్లో స్థిరపడటమో చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో వృద్ధులు ఉన్న ఊరిని విడిచి రాలేక.. గ్రామస్తులతో బంధాన్ని వీడలేక.. ఇంట్లో ఒంటరిగానే ఉంటుంటారు. మరికొందరు భర్త చనిపోయో.. తదితర కారణాలతో ఒంటరిగా జీవనం సాగిస్తుంటారు. ఇలాంటి వారినే టార్గెట్ చేసుకుని కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవలి కాలంలో ఒంటరి మహిళలు, ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులపై దాడుల ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నంలో వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మొగల్తూరు మండలం కాళీపట్నంలో ఒంటరిగా నివాసం ఉంటున్న బళ్ల సూర్య ఆదిలక్ష్మి అనే 55 సంవత్సరాల వృద్ధురాలిపై దుండగుడు దాడికి పాల్పడ్డారు. ఆపై ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసులు, చెవులకున్న దుద్దులు, ఇంట్లో నగదు దోచుకుపోయాడు. ఆమె కేకలకు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూసేసరికి ఆదిలక్ష్మి రక్తపు మడుగులో పడి ఉంది. చెక్కతో తలపై బాధటంతో అపస్మారస్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె పరిస్థితి విషమించడంతో అంబులెన్స్లో అమలాపురం తరలించారు. రంగంలోకి దిగిన మొగల్తూరు పోలీసులు ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
